ముంబై: ప్రో కబడ్డీ లీగ్లో డైనమిక్ రైడర్ నవీన్ కుమార్ చెలరేగి ఆడడంతో దబాంగ్ ఢిల్లీ 40-29 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్పై ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ పోరులో దీపక్ హుడా వరుస రైడ్లతో పాయింట్లు సాధించడంతో ఆట మొదలైన 10 నిమిషాలకే జైపూర్ పింక్ పాంథర్స్ 9-5 స్కోరుతో ముందుకెళ్లింది.
జూలు విదిల్చిన దబాంగ్ ఢిల్లీ రైడర్…
ఈ క్రమంలో దబాంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ వరుసగా పది పాయింట్లతో జూలు విదల్చడంతో మొదటి అర్థభాగం ముగిసేసరికి దబాంగ్ ఢిల్లీ 20-16 స్కోరుతో పైచేయి సాధించింది. రెండవ అర్ధభాగంలో దబాంగ్ ఢిల్లీ రైడర్లు మిరాజ్ షేక్ 9 పాయింట్లు, చంద్రన్ రంజిత్ 8 పాయింట్లతో అదరగొట్టగా డిఫెండర్ జోగిందర్ నర్వాల్ ఐదు టాకిల్ పాయింట్లతో సత్తా చాటడంతో మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ సొంతమైపోయింది.
ఇక ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ జట్టు 35-31 స్కోరుతో యూ ముంబా జట్టుపై గెలిచింది.