తల్లి వివాహేతర సంబంధం.. వ్యక్తిని దారుణంగా హతమార్చిన కుమారులు…

Womens Sons
- Advertisement -

Womens Sons

హైదరాబాద్‌: తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ముగ్గురు అన్నదమ్ములు కలిసి దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. హత్య అనంతరం నిందితులు ముగ్గురు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.

అదనపు డీసీపీ సయ్యద్‌రఫీక్‌, ఏసీపీ అంజయ్య, రెయిన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయుల తెలిపిన వివరాల ప్రకారం…. రహ్మత్‌నగర్‌ బస్తీకి చెందిన వివాహిత జీవనోపాధి కోసం అరబ్‌లో ఉంటోంది. ఆమెకు మహ్మద్‌ సోహెల్‌(23), మహ్మద్‌ సులేమాన్‌(21) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  ప్రస్తుతం ఆమె భర్త నుండి విడిపోయి అరబ్‌దేశంలో ఉంటోంది.  కార్వాన్‌ బస్తీకి చెందిన తన భర్త అక్క కొడుకు జావీద్‌ (33)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయమై ఆమెకు భర్త, పిల్లలు నచ్చజెప్పారు. అయినా సరే ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన భర్త ఆమెతో విడిపోయి.. వేరే వెళ్లిపోయి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. తల్లిదండ్రులు విడిపోవడం, తల్లి వివాహేతర సంబంధం పెట్టుకోవడం ..ఈ విషయాలను పిల్లలు జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

దీంతో ఎలాగైన జావిద్‌ను అడ్డు తొలగించాలని భావించారు. సవతి తల్లి కుమారుడు మహ్మద్‌ ఈసా(21)తో కలిసి అతడి హత్యకు పథకం వేశారు. ఈ నేపథ్యంలో  మారణాయుధాలను సేకరించి తమ ఇంటి వద్ద పెట్టుకున్నారు. గురువారం రాత్రి తల్లి అరబ్‌దేశం నుంచి పిల్లల ఖర్చుల కోసం డబ్బులను జావిద్‌ ద్వారా పంపించింది.

దీంతో గురువారం రాత్రి డబ్బు తీసుకుని జావీద్ యాఖుత్‌పురా మదీన మసీద్‌ వద్దకు వెళ్లాడు. జావిద్‌ రాకను గమనించిన ముగ్గరూ మారణాయుధాలతో అతడిపై దాడి చేశారు. అతడి కడుపు, గొంతు, ఛాతీపై విచక్షణారహితంగా పొడిచారు. అంతేకాకుండా అతడి మర్మాంగాలు కోసేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం నిందితులు రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. నిందితుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జావిద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు.

- Advertisement -