భువనేశ్వర్: ముక్కుపచ్చలారని ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నట్లుండి అదృశ్యమయ్యారు. ఏం జరిగిందో తెలిసే లోపే.. ముగ్గురూ శవాలై ఓ చెరువులో తేలారు.
ఈ ఘోరం ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా డియోగంజ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు సోమవారం అదృశ్యమయ్యారు.
బాలికలు ఇళ్లకు తిరిగిరాకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం స్థానికులు గ్రామంలోని చెరువులో ఈ ముగ్గురి మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు చెరువు వద్దకు చేరుకుని ఆ ముగ్గురు బాలికల మృతదేహాలను బయటికి తీయించారు. ఒక్కరోజులో ముగ్గురు బాలికలు అసువులు బాయడంతో డియోగంజ్ గ్రామంలో విషాదం అలముకుంది.
బాలికలు స్నానం కోసం చెరువులోకి దిగి, పొరపాటున లోతుకు వెళ్లి మునిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.