

న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో టీమిండియా ఆడాలా? వద్దా? అనే విషయంపై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మౌనం వీడారు. ఇప్పటి వరకు మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. తాజాగా కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు.
ఇంగ్లాండ్లో జరిగే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో ఆడటమా? లేదా? విషయంపై ప్రభుత్వం, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా తాను, తన టీం దానికి కట్టుబడి ఉంటుందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
‘ పుల్వమా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. పాక్తో మ్యాచ్ రద్దు అంశంపై మేం ఒక నిర్ణయానికొచ్చాం. పుల్వామా ఘటనపై ఎన్నో దేశాలు స్పందించాయి. ఘటనను ఖండించాయి. ఇప్పుడు భారతీయుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత జట్టు కెప్టెన్గా నా మీద ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేం కట్టుబడి ఉంటాం. వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం’ అని తెలిపాడు.
పాక్తో మ్యాచ్ను భారత్ రద్దు చేసుకోవాలని పలువురు మాజీలు కోరుతున్నారు. పాక్తో మ్యాచ్ను బహిష్కరించే బదులు ఆడి ఆ జట్టును ఓడించడం మంచిదని గావస్కర్, సచిన్లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఆడటం, ఆడకపోవడం అనే మనలాంటి వాళ్లు నిర్ణయించేది కాదని, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
చదవండి: తొలి మహిళ: తేజస్ యుద్ధ విమానం నడిపిన పీవీ సింధు








