కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియా యోసిమైట్ నేషనల్ పార్కులో జరిగిన విషాదకర ఘటనలో భారత్కు చెందిన ఓ యువ ఐటీ ఇంజనీర్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ‘శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్’ వెల్లడించిన వివరాల ప్రకారం… దక్షిణ భారతదేశానికి చెందిన విష్ణు విశ్వనాథ్(29), మీనాక్షి మూర్తి (30) దంపతులు న్యూయార్క్లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
ట్రెక్కింగ్, అడ్వెంచర్ ట్రిప్పులకు వెళ్లడమంటే మక్కువ ఉన్న ఈ జంట గురువారం కాలిఫోర్నియాలోని జాతీయ పార్కుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న 800 అడుగుల లోతైన లోయలో పడిపోయారు.
సిస్కో కంపెనీలో పనిచేస్తున్న ఇండియన్ టెక్కీలుగా…
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పార్క్ అధికారులు ఆ దంపతుల జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సోమవారం సాయంత్రం వీరి మృతదేహాలను కనుగొన్నారు. వీరిని సిస్కో కంపెనీలో పనిచేస్తున్న ఇండియన్ టెక్కీలుగా గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదన్నారు.బఅసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న విషయమై విచారిస్తున్నామని తెలిపారు.
వీరికి 2014లో వివాహం జరిగిందని, వీరి మృతిపై కేరళకు చెందిన చెంగునూర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. తమ పూర్వ విద్యార్థులైన విష్ణు, మీనాక్షి మరణించడం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. వీరిద్దరూ 2006-10 బ్యాచ్కు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేసింది.
విష్ణు విశ్వనాథ్, మీనాక్షి మూర్తి జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, ఇద్దరూ ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మరణం దురదృష్టకరమని వారి సన్నిహితులు పేర్కొన్నారు. వారికి సంబంధించిన ప్రతీ అప్డేట్ని.. ‘హాలీడేస్ అండ్ హ్యాపిలీ ఎవర్ఆఫ్టర్స్’ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమతో ఙ్ఞాపకాలు పంచుకునే వారంటూ విషాదంలో మునిగిపోయారు.