ముంబై: వన్డేల్లో టాప్ లేపుతున్న భారత్ జట్టు నాలుగో వన్డేలోనూ దుమ్ము రేగ్గొట్టింది. హార్డ్ హిట్టర్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి విజృంభించి 163 పరుగులు సాధించడం, అతనికి అండగా అంబటి రాయుడు కూడా సెంచరీ చేయడంతో.. నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. మరోవైపు మొదటి, రెండు వన్డేల్లో హోరాహోరీగా పోరాడిన వెస్టిండీస్ జట్టు.. మూడో వన్డేకి వచ్చేసరికి ఆత్మస్థయిర్యం దెబ్బతిన్నట్లుగా కనిపించింది.
తొలి వన్డే మ్యాచ్లో 300పైనే పరుగులు చేసినా వెస్టిండీస్కు ఓటమి తప్పలేదు. ఇక విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో కూడా హోరాహోరీగా పోరాడి.. చివరికి మ్యాచ్ను ‘టై’గా ముగించగలిగింది. దీంతో టీమిండియా.. వెస్టిండీస్ని తక్కువగా అంచనా వేయలేమని భావించి.. ఈసారి ఏకంగా 377 పరుగుల భారీ టార్గెట్ని వారి ముందుంచింది.
ఆ తరువాత బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్.. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని మొదటే డిసైడ్ అయినట్టుగా సాగింది. ప్రతి బంతిని కొట్టక తప్పని పరిస్థితుల్లో.. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ పోయింది. దీంతో ఒక దశలో వెస్టిండీస్ జట్టు 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. చివరికి టెయిల్ ఎండర్స్.. జాగ్రత్తగా ఆడి పరువు కాపాడే పనిలో పడ్డారు.
అడపాదడపా స్పిన్నర్ల బౌలింగ్లో సరదాగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ ప్రాక్టీస్ మ్యాచ్ లా ఆడి.. స్కోరుని 153 పరుగుల వరకు తీసుకువచ్చి గౌరవప్రదంగా మ్యాచ్ని ముగించారు.
టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన…
వెస్టిండీస్తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో విజృభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (137 బంతుల్లో 162; (4 x 20,6 x 4) మిడిలార్డర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు 81 బంతుల్లో 100; (4 x 8 ,6 x 4) శతకాల మోతతో టీమిండియా తిరుగులేని విజయాన్ని అందుకుంది.
సోమవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మూడో వికెట్కు రోహిత్, రాయుడు కలిసి 211 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటితో పాటు ఫీల్డర్ల చురుకుదనంతో ఛేదనలో వెస్టిండీస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
36.2 ఓవర్లలో 153 పరుగులకే వెస్టిండీస్ ఆలౌటైంది. కెప్టెన్ జాసన్ హోల్డర్ 70 బంతుల్లో 54 నాటౌట్; (1 x 1 , 6 x 2) మినహా మరే బ్యాట్స్మన్ నిలవలేకపోవడంతో విండీస్ 224 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (3/13), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/42) చేరో మూడేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని పుంజుకోకుండా చేయగలిగారు.
లేదంటే ఫ్లాట్ పిచ్పై టీమిండియా ఆడినట్టు వెస్టిండీస్ కూడా ఆడేది. ఎందుకంటే గత రెండు వన్డేల్లో కూడా వెస్టిండీస్ 300కు పైనే పరుగులు సాధించడం విశేషం. దీనివల్ల భారత్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు పడగొట్టడం, భాగస్వామ్యాలు పెరగకుండా చూడటంతో.. విజయం దిశగా భారత్ త్వరగా పయనించింది. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సిరీస్లో చివరిదైన ఐదో వన్డే గురువారం తిరువనంతపురంలో జరగనుంది.
భారత్ శుభారంభం…
సిరీస్లో తొలిసారిగా ఓపెనర్లిద్దరూ నిలవడంతో ఈ మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కింది. ముందుగా రోహితే మొదలుపెట్టినా, కొద్దిసేపటికే శిఖర్ ధావన్ 40 బంతుల్లో 38; 4 x 4 , 6 x 2) కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. అయితే, కీమో పాల్ ఓవర్లో పుల్ చేయబోయి మిడ్ వికెట్లో రావ్మన్ పావెల్కు క్యాచ్ ఇచ్చాడు. ధావన్ అవుట్ అవడంతో తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
హ్యాట్రిక్ సెంచరీల మోతతో జోరుమీదున్న కెప్టెన్ విరాట్ కొహ్లీ 17 బంతుల్లో 16 పరుగులు (2×4)) ఈసారి ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన రోచ్ బంతిని థర్డ్మ్యాన్ దిశగా ఆడే ప్రయత్నంలో విఫలమై కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సంవత్సరంలో వన్డేల్లో కోహ్లీకి ఇదే అతి తక్కువ స్కోరు.
భారీ ఇన్నింగ్స్లతో టీమిండియాకు వెన్నెముకలా నిలుస్తున్న కెప్టెన్ అవుట్ కావడంతో భారం అంతా రోహిత్, రాయుడులపై పడింది. దీనిని వారు సమర్థంగా ఎదుర్కొన్నారు. కుదురుకునేందుకు కొద్ది సమయం తీసుకున్నా, తర్వాత తమ దూకుడు పెంచారు.
ఈ క్రమంలో రోహిత్ 60 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అనంతరం రావ్మన్ పావెల్ ఓవర్లో మూడు, నర్స్ ఓవర్లో రెండు బౌండరీలతో చకచకా 90ల్లోకి వెళ్లిపోయాడు. రోహిత్ అలెన్ బౌలింగ్లో ఫోర్తో కెరీర్లో 21వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే రాయుడు అర్ధశతకం మార్క్ను చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి బౌలర్ ఎవరన్నది చూడకుండా ఫోర్లు, సిక్స్లతో ఇద్దరూ ధాటిగా ఆడుకుంటూ పోయారు 33 ఓవర్లకు 199/2తో ఉన్న స్కోరు 43వ ఓవర్కు 300 దాటిందంటేనే ఈ ఇద్దరు ఎంత విధ్వంసకర బ్యాటింగ్ చేసారో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఊపులో రోహిత్ 150 పరుగుల మైలురాయి (131 బంతుల్లో)ని అధిగమించాడు. కానీ, కాసేపటికే 162 పరుగుల వద్ద అతడి ఇన్నింగ్స్కు తెరపడింది.
రోచ్ ఓవర్లో యార్కర్ లెంగ్త్ బంతిని సిక్స్ కొట్టి 90 పరుగులకు చేరుకున్న రాయుడు… అనంతరం ఒక్కో పరుగు జోడిస్తూ వన్డేల్లో మూడో శతకాన్ని (80 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అయిన వెంటనే రాయుడు రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన ఎమ్.ఎస్.ధోని 15 బంతుల్లో 23 పరుగులు(2×4) కేదార్ జాదవ్ 7 బంతుల్లో 16 పరుగులు (3×4)(నాట్ అవుట్) , రవీంద్ర జడేజా 4 బంతుల్లో 7 పరుగులు (1×4)(నాట్ అవుట్ ), దొరికిన బాల్ ని దొరికినట్టు కొట్టి టీమిండియాని భారీ స్కోర్ దిశగా నడిపించారు.
భారీ లక్ష్య ఛేదనలో చతికిలపడిన వెస్టిండీస్..
అతి భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 36.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. గత మూడు మ్యాచ్ల్లో అందరు బ్యాట్స్మెన్స్ కలిసి జట్టుకు భారీ స్కోర్ చేసేందుకు ఉపయోగపడ్డారు. ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్లు కీరన్ పావెల్ 4 పరుగులు, హేమ్రాజ్ 14 పరుగులతో పాటు నిలకడగా రాణిస్తున్న షై హోప్ పరుగులేమి చేయకుండా మూడు వికెట్లు ఒకే స్కోరు వద్ద కోల్పోయిన వెస్టిండీస్ జట్టు మరింక కోలుకోలేదు.
ఖలీల్ స్వింగ్ బంతులకు మార్లోన్ శామ్యూల్స్ 23 బంతుల్లో 18(4X3), అద్భుత ఫామ్లో ఉన్న హెట్మైర్ 11 బంతుల్లో 13 (4×2), రావ్మన్ పావెల్ (1) వరుసగా క్యూ కట్టడంతో చేసేదేమీ లేకపోయింది. 56/6తో నిలిచిన వెస్టిండీస్ జట్టును జాసన్ హోల్డర్ 70 బంతుల్లో 54 (4x16x2)తో మరీ తక్కువ స్కోరుకే పరిమితం కాకుండా చూశాడు.
సూపర్ రనౌట్ చేసిన కోహ్లీ..
మ్యాచ్లో తన మార్క్ ఉండేలా చూడటంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. పరుగులు చేసినా.. చేయకపోయినా, మ్యాచ్ విజయంలో తనదైన ముద్ర తప్పకుండా ఉంటుంది. తక్కువ స్కోరుకే అవుటైనా కూడా తన మెరుపు ఫీల్డింగ్తో మెరిశాడు. విండీస్ బ్యాట్స్మన్ శామ్యూల్స్ కవర్స్ దిశగా కొట్టిన షాట్ను అడ్డుకున్న కోహ్లీ… అంతే వేగంగా డైవ్తో బంతిని నాన్ స్ట్రయికింగ్ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్ పావెల్ తిరిగి క్రీజును చేరే అవకాశం లేక అవుట్ అయి వెనుతిరగాల్సి వచ్చింది. ఏదేమైనా ఈరోజు టీమిండియాది.. అంతే. కలిసి వస్తే అన్నీ ఇలా కలిసివస్తాయి. మనదికాని రోజున ఎంత గొప్పగా ఆడినా మ్యాచ్ చేజారిపోతుంది. దీనికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. క్రికెట్ పరిభాషలో చెప్పుకునే మాట ఇది.. ఈరోజు మనది.. అంతే!