టొరంటో: కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో మరో ప్రవాస భారతీయుడు హత్యకు గురయ్యాడు. ఇటీవల తెలంగాణకు చెందిన విద్యార్థి శరత్ కొప్పు అమెరికాలోని ఓ రెస్టారెంట్లో ఓ దుండగుడి చేతిలో బలైపోయిన ఉదంతం మరువకముందే కెనడాలో పల్విందర్ సింగ్(27) అనే మరో ఎన్నారై దుండగుల కాల్పుల్లో అశువులు బాయటం తీరని వేదనను కలిగిస్తోంది.
భారత సంతతికి చెందిన పల్విందర్ సింగ్ను అతడి ఇంట్లోనే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్విందర్ సింగ్ 2009లో ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లాడు. బ్రాంప్టన్ నగరంలో నివాసం ఉంటున్న అతడు ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తుండేవాడు.
ఈ క్రమంలో మంగళవారం నలుగురు గుర్తు తెలియని దుండగులు పల్విందర్ ఇంట్లోకి ప్రవేశించి అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ హత్య కేసులో నిందితులైన మిస్సిస్సౌగాకు చెందిన 18, 19 ఏళ్ల యువకులిద్దరూ లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
మరో రెండు రోజుల్లో పల్విందర్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సి ఉందని, ఇంతలోనే ఇలా జరగడం ఘోరమంటూ అతడి స్నేహితుడొకరు కన్నీటి పర్యంతమయ్యాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. బ్రాంప్టన్లో ఇది ఈ ఏడాది చోటు చేసుకున్న 11వ హత్య అని, తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.