హైదరాబాద్: ఎడతెగని మంతనాల తర్వాత.. కూకట్పల్లి టికెట్ దివంగత టీడీపీ నేత హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఖరారు చేస్తూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. హరికృష్ణ కుమార్తె సుహాసినిని గురువారం విశాఖపట్టణంలో చంద్రబాబు కలిసి చర్చించారు.
ఈ నేపథ్యంలో కూకట్పల్లి స్థానంపై రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్స్టాప్ పడింది. హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఈ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిపితే, తెలంగాణలో మహాకూటమికి మరింత ఊపు వస్తుందని ఇటు టీడీపీ వర్గాలు మాత్రంమే కాదు, కాంగ్రెస్ వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి.
నందమూరి కుటుంబం నుంచి ఒక్కరైనా….
నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఎవరైనా ఉంటే బాగుంటుందని ముందు నుంచీ ఆలోచనలో ఉన్న చంద్రబాబు.. తొలుత ఆ అవకాశాన్ని హరికృష్ణ కుమారుడు, సినీనటుడు కళ్యాణ్ రామ్కు ఇవ్వాలని భావించారు. ఈ మేరకు కళ్యాణ్ రామ్తో చర్చించారు.
అయితే తాను మరికొంత కాలం సినీ రంగంలోనే కొనసాగుతానని, ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కళ్యాణ్ రామ్ స్పష్టం చేయడంతో అనూహ్యంగా ఆయన అక్క అయిన సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. నందమూరి కుటుంబానికి కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్న అభిమానుల సంఖ్య దృష్ట్యా, సుహాసిని గెలుపు సునాయాసం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
అక్క గెలుపు బాధ్యత మీదే…
అంతేకాదు, కూకట్పల్లి నియోజకవర్గంలో సుహాసిని గెలిపించే బాధ్యతను హరికృష్ణ కుమారులైన కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లపై ఉంచారు అపర చాణక్యుడు చంద్రబాబు. సుహాసినిని పిలిపించి మాట్లాడిన ఆయన, ఆపై హరికృష్ణ తనయులతోనూ చర్చించారు. అక్క గెలిపు కోసం కృషి చేయాలని వారికి సూచించారు.
అలాగే కూకట్పల్లి నియోజకవర్గంలో సుహాసిని విజయం కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఈ సందర్బంగా తనను కలిసిన నేతలకు కూడా చంద్రబాబు సూచించారు. శనివారం సుహాసినితో కూకట్పల్లిలో నామినేషన్ వేయించనున్నారు. న్యాయవాద విద్యను పూర్తి చేసిన సుహాసిని మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు అనే సంగతి తెలిసిందే.
పెద్దిరెడ్డి, మందాడిలకు మరో రకంగా న్యాయం…
ఈ క్రమంలో కూకట్పల్లి టికెట్ ఆశించిన కేపీహెచ్బీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డిలకు మరో రకంగా న్యాయం చేస్తాని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.