

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వేతన జీవులకు, పింఛన్ దారులపై వరాల వర్షం కురిపించింది. ఆదాయపు పన్ను పరిమితిని కేంద్రం 2.5 లక్షల నుంచి ఏకంగా రూ.5 లక్షలకు పెంచింది. దీంతో వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు.
చదవండి: కేంద్ర బడ్జెట్ 2019: పార్లమెంట్లో పీయూష్ గోయల్ ప్రసంగం.. మధ్య తరగతి, రైతులపై వరాల వర్షం…
అంతేకాదు… పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని కూడా రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. అలాగే పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్ పరిమితి రూ. 10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్లో ప్రకటించారు.
అసంఘటిత కార్మికులకు కొత్త పింఛన్…
మధ్యంతర బడ్జెట్లో అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ పథకం ప్రకటించింది. లోక్సభలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ దీనిపై ప్రకటన చేశారు.
‘ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్’ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ పింఛన్ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికీ నెలకు రూ.3 వేలు పింఛన్ రానుంది. ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున కార్మికులు ప్రీమియం చెల్లించాలి. దీని ద్వారా అసంఘటిత రంగంలోని దాదాపు 10 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమలులోకి రానుంది.








