న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగిపోతోంది. గతంతో పోలిస్తే ఈసారి చాలా తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి కూడా చాలా వేగంగా జరుగుతోంది.
సెకండ్ వేవ్తో యువతకే ఎక్కువ ప్రమాదమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరిస్తోంది.
ఈ సారి వృద్ధుల కంటే కూడా యువతనే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారని ఐఎంఏ అధ్యక్షుడు జయలాల్ వెల్లడించారు.
కాబట్టి వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మూడు నెలల్లో 35 కోట్ల మందికి వేస్తేనే..
మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన వారందరికీ టీకా వేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని జయలాల్ తప్పుబట్టారు.
సెకండ్ వేవ్లో యువతీయువకులే కరోనా బారిన పడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తమ వ్యూహానని మార్చుకోవాలని సూచించారు.
వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాల్సిందేనని పేర్కొన్నారు. భారత్లో హెర్డ్ ఇమ్యూనిటీ పెరగాలంటే రానున్న రెండు మూడు నెలల్లో 30 నుంచి 35 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మొదటి దశతో పోలిస్తే సెకండ్ వేవ్లో కరోనా మరణాలు తగ్గాయని జయలాల్ పేర్కొన్నారు. అయితే కరోనా బారిన పడే వారి సంఖ్య మాత్రం పెరిగిందని తెలిపారు.
గతంలో ఒక కుటుంబంలో ఒకరిద్దరు మాత్రమే కరోనా బారిన పడితే ఇప్పుడు ఐదు నుంచి ఆరుగురు కరోనా బారిన పడుతున్నారని వివరించారు.