అమరావతి: ఏపీలో వైసీపీ జోరుకి టీడీపీ నిలబడలేకపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతూ , చివరికి భారీ విజయాన్ని అందుకుంది. జగన్ నేతృత్వం లోని వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది.
అధికార టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీడీపీ, కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక జనసేన పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.
ఇకపోతే విషయానికొస్తే … ఎక్కడైనా కూడా విజేతల గురించే అందరూ మాట్లాడుకుంటారు, అలాగే వారికి శుభాకాంక్షలు చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ముఖ్యంగా రాజకీయరంగంలో ఇది బాగా కనిపిస్తుంది. దేశంలో మెల్లిమెల్లిగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఏపీలో అసాధారణ రీతిలో విజయం సాధించిన వైసీపీ అధినేత , ఏపీ నయా సీఎం జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ విషెస్ చెప్పారు.
ప్రియమైన జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను. మీకు ఇవే నా శుభాకాంక్షలు. మీ ఐదేళ్ల పదవీకాలంలో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ట్వీట్ చేశారు.