

రియాధ్: వివాహం ద్వారా తమ జీవితానికి భద్రత లభిస్తుందని, భవిష్యత్తు ఆనందమయం అవుతుందనేది చాలామంది మహిళల భావన. అగ్నిసాక్షిగా పెళ్లాడి, జీవితాంతం కలిసి ఉంటామని బాసలు చేసిన పలువురు దంపతులు ఆ తరువాత నచ్చక విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ట్రిపుల్ తలాక్ కారణంగా ఇన్నాళ్లూ మన దేశంలో ముస్లిం మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో జగమెరిగిన సత్యం.
ఈ విషయంలో సౌదీ అరేబియాతో పోల్చుకుంటే మన దేశమే కాస్త నయం. అవును, ఇక్కడ కనీసం భార్యతో మూడుసార్లు భర్త
తలాక్ అయినా చెబుతాడు. సౌదీలో అయితే భర్తలు తమ భార్యలకు చెప్పకుండానే విడాకులు ఇచ్చేస్తుంటారు. అక్కడి పురుషులకు ఇలాంటి చట్టాలు వరంగా మారాయి. ఫలితంగా సౌదీలో ఎంతో మంది మహిళలు తరతరాలుగా పురుషాధిపత్యానికి బలైపోతూనే ఉన్నారు.
అయితే తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇకమీదట భర్తలు.. తమ భార్యలకు విడాకులు ఇవ్వదలుచుకుంటే.. ఆ విషయం తమ భార్యలకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన ఈరోజు ( 6 జనవరి 2019 ) నుంచే అమలులోకి వచ్చింది. అంతేకాదు, భర్తలు తప్పనిసరిగా విడాకుల కాపీని తమ భార్యలకు చూపించాలని కూడా అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలో పొందుపరిచింది.
కొత్త నిబంధనతో సౌదీ మహిళలకు ఊరట…
దీనిపై జెడ్డాకు చెందిన మహిళా అడ్వకేట్ నస్రీన్ అల్ ఘమిడి మాట్లాడుతూ.. కొత్త నిబంధన మహిళలకు ఎంతో ఊరట కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో కొంతమంది భర్తలు విడాకుల గురించి ముందుగా అసలు సమాచారం కూడా ఇవ్వకుండానే విడాకులు తీసేసుకుని తమ భార్యలను ఇంటి నుంచి వెళ్లగొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
మరికొంతమంది భర్తలు తమ భార్యలకు విడాకులు ఇస్తున్నట్లుగా టెక్స్ట్ మెసేజ్ పంపేవారని, కొత్త నిబంధన ప్రకారం.. ఇక మీదట విడాకులు తీసుకోవడానికి ముందే భర్తలు ఆ విషయాన్ని భార్యలకు తెలియజేయాల్సి ఉంటుందని, సౌదీ మహిళలకు ఇది నిజంగా శుభవార్త అని అడ్వకేట్ నస్రీన్ వివరించారు.








