షాద్నగర్: కొత్త ప్రియుడితో కలసి మరో పాత ప్రియుడిని హత్య చేసి, ముంబై పారిపోతూ షాద్ నగర్ పోలీసులకు దొరికిపోయిన ప్రియురాలి సంగతి ఇది.. అక్టోబర్ 20న షాద్నగర్లో ఓ హత్య జరిగింది, ఆ కేసును పరిశోధిస్తున్న పోలీసులకు విస్మయాన్ని కలిగించే ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రియుడిని, పాత ప్రియురాలిని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఫరూక్ నగర్ మండలం గుండుగేరికి చెందిన ఈరమోని శేఖర్ (24), పర్వీన్ బేగం (18) గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 8 నెలల క్రితం గుండుగేరికి ఉపాధి నిమిత్తం వచ్చిన తోళ్ల వ్యాపారి మహమ్మద్ ఆసిఫ్ ఖురేషీ (23)తో పర్వీన్కు పరిచయం కాగా, పర్వీన్ బేగం అతన్ని కూడా ప్రేమించింది. ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు.
ఈ క్రమంలో శేఖర్ ప్రేమ విషయం ఆసిఫ్కు తెలిసింది. అతడు విషయంపై పర్వీన్ను నిలదీయగా, శేఖర్ తన వద్ద 4,500 రూపాయలు అప్పు తీసుకున్నాడని, అడిగితే దాన్ని ఇవ్వకుండా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అబద్ధాలు చెప్పి నమ్మించింది. దాంతో ఇద్దరూ కలసి శేఖర్ను ఎలాగైన చంపాలని నిర్ణయించుకుని దానికి ప్లాన్ కూడా వేసుకున్నారు.
ఈ క్రమంలో అక్టోబర్ 19న రాత్రి శేఖర్ను పని ఉందని చెప్పి తన ఇంటికి రప్పించిన పర్వీన్, మద్యంలో నిద్రమాత్రలు కలిపి అతడితో తాగించింది. అది తాగి శేఖర్ మత్తులోకి జారుకోగానే, ప్రియుడి సాయంతో శేఖర్ గొంతుకోసి చంపేసింది. మృతదేహాన్ని అక్కడే ఇళ్ల మధ్య పడేసి ఇద్దరు హైదరాబాద్కు వచ్చేశారు,
ఇద్దరు కలిసి ముంబైకి పారిపోయేందుకు నిర్ణయించుకుని తిరిగి షాద్నగర్కు వెళ్లారు. పోలీసులు శేఖర్ హత్యపై అప్పటికే వీరిద్దరిపై అనుమానంతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో షాద్నగర్ చేరుకున్న వీరిని చాకచక్యంగా అరెస్ట్ చేసి.. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.