బీహార్ కీచకపర్వం: కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు, 29 కాదు.. మొత్తం 34 మంది బాలికలపై అత్యాచారం!

Bihar-shelter-home-rapes
- Advertisement -

bihar-shelter-home-digging

బాలిక మృతదేహం కోసం వసతిగృహం ఆవరణలో తవ్వుతున్న దృశ్యం


పాట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ప్రభుత్వ వసతిగృహంలో జరిగిన కీచక పర్వంలో విస్మయంగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.  వసతి గృహంలోని దాదాపు 29 మంది బాలికలపై అక్కడి సిబ్బంది కొన్ని నెలలుగా అత్యాచారాలకు పాల్పడినట్లు తొలుత బయటికి వచ్చింది. అయితే  తాజాగా జరిపిన వైద్య పరీక్షల్లో ఆ 29 మంది కాకుండా మరో ఐదుగురు విద్యార్థినులు కూడా అత్యాచారానికి గురైనట్లు తేలింది. వసతిగృహంలో మొత్తం 40 మంది బాలికలు ఉండగా వారిలో 34 మంది అత్యాచారానికి గురైనట్లు తెలుస్తోంది.

అంతేకాదు, అక్కడ పనిచేసే సిబ్బంది అకృత్యాలను వ్యతిరేకించి నిలదీయడంతో ఓ బాలికను వారు హత్యచేసి, ఆమె మృతదేహాన్ని వసతిగృహం ఆవరణలోనే పూడ్చిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికలు.. వసతిగృహం సిబ్బంది తమను అత్యంత దారుణంగా హింసించి అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించారు.

మహిళా కమిషన్ ప్రతినిధులకు బాధిత బాలికల మొర…

మహిళా కమిషన్‌ ప్రతినిధులు శనివారం  బాధిత విద్యార్థినులను కలుసుకున్నారు. అనంతరం మహిళా కమిషన్ ఛైర్మ్‌పర్సన్‌ దిల్మని మిశ్రా మాట్లాడుతూ.. వసతిగృహం సిబ్బంది బాలికలను దారుణంగా కొట్టి, వారు అరవకుండా ఉండేందుకు డ్రగ్స్‌ ఇచ్చే వారని చెప్పారు. వారికి సరైన ఆహారం కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసేవారని, వారి ఆగడాలను ఎదురించిన బాలికలను వస్త్రహీనులను చేసి కొట్టి, సిగరెట్లతో శరీరమంతా వాతలు పెట్టి దారుణంగా హింసించేవారని ఆమె పేర్కొన్నారు. వీళ్ల ఆకృత్యాలను వ్యతిరేకించిన ఓ చిన్నారిని చితకబాదడంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరి ప్రాణాలు కోల్పోయిందని, సిబ్బంది వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యా యత్నం కూడా చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని వివరించారు.

చెబితే చంపేస్తామని బెదిరించారు…

గతంలో శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), జిల్లా మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పలుమార్లు ఆ వసతి గృహానికి పరిశీలించడానికి వెళ్లినప్పుడు..  వసతి గృహ సిబ్బంది బాలికల వెన్నంటే ఉండేవారు. జరుగుతున్న అరాచకాల గురించి చెబితే చంపేస్తామని కూడా వారిని బెదిరించారు. దీంతో భయపడిపోయిన బాలికలు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికి సాహసించలేదు. చివరికి కొద్ది నెలల కిందట టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన అధ్యయనంలో ఈ కీచకపర్వం యావత్తూ వెలుగులోకి వచ్చింది. ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీ అట్టుడికింది. దీనికి బాధ్యులైన 10 మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

tejashwi-yadavబీహార్‌లో రాక్షస పాలన: తేజస్వి యాదవ్…

నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడి, విమర్శలతో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రభుత్వ సహకారంతో ఈ వసతిగృహాన్ని నడిపిస్తోన్న బ్రజేశ్ కుమార్ అనే సామాజిక కార్యకర్తను గత నెలలోనే అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘బీహార్‌లో రాక్షస పాలన సాగుతోంది.. సీతమ్మను రావణుడు అపహరించాడు.. దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయించాడు.. బీహార్‌లోనూ రావణ- దుర్యోధన ద్వయం అక్కచెల్లెళ్లు, అమ్మలు బయట అడుగుపెట్టడానికి భయపడేలా చేస్తున్నారు..’’ అంటూ ధ్వజమెత్తారు. నితీష్ మంత్రివర్గంలోని మహిళ సభ్యురాలు మంజు వర్మ భర్త తరుచూ ఈ బాలికల వసతిగృహాన్ని సందర్శించినట్టు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -