
హైదరాబాద్: యాంకర్ రష్మీ.. ఈ పేరు తెలియని బుల్లితెర అభిమాని ఎవరూ ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. రష్మీ తల్లి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు కాగా తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. కానీ రష్మీ మాత్రం విశాఖపట్నంలో పెరిగింది. ఆ తరువాత సినీ పరిశ్రమలో అవకాశాల కోసం హైదరాబాద్లో అడుగుపెట్టింది.
2002లో ‘సవ్వడి’ అనే సినిమాతో రష్మీ తన సినీ కెరీర్ని ప్రారంభించింది, అయితే ఎందుకో ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన ‘హోలీ’ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. ఆ తరువాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుని పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించింది.
ఆ తరువాత వెండితెర నుండి బుల్లితెరకి షిఫ్ట్ అయ్యింది. ఈ టివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి, అలాగే ఢీ షోకి ప్రస్తుతం రష్మీ యాంకర్గా వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ యాంకర్స్లో రష్మీ కూడా ఒకరు. ఇకపోతే అసలు విషయానికొద్దాం… పలు షోలకి యాంకరింగ్ చేసే రష్మీ ఈ మద్యే ఒక కొత్త కారుని కొనుక్కుంది. ఆ కారు కారణంగానే రష్మీ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తుంది.
కారు తెచ్చిన తిప్పలు…
విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వేగంగా వస్తూ యాంకర్ రష్మీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు సమాచారం.
ఈ ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రుడిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.








