ముంబై: బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ముంబై పోలీసులు అతడి సహనటి సంజన సంఘీని విచారించి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
సుశాంత్ నటించిన చివరి సినిమాలో సంజన అతడితో కలిసి నటించింది. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 28 మంది వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. త్వరలోనే ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ స్టేట్మెంట్ను కూడా తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
సుశాంత్ గత నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్ సహా మొత్తం చిత్ర పరిశ్రమను సుశాంత్ ఆత్మహత్య కదిలించింది. అతడి మరణానికి నెపోటిజమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి.
బంధుప్రీతి కారణంగా టాలెంట్ ఉన్నప్పటికీ ఇతరులకు అవకాశాలు లభించడం లేదంటూ మండిపడిన నెటిజన్లు.. సుశాంత్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న వారిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అన్ఫాలో చేయడం సంచలనమైంది.
అంతేకాదు, మరికొందరు సెలబ్రిటీలు స్వయంగా సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు. కరణ్ జోహార్ లాంటి వారైతే అందర్నీ అన్ఫాలో చేసి కేవలం 8 మందిని ఫాలో అవుతుండడం గమనార్హం.
https://www.instagram.com/p/CCDIRrLA3AF/