ముంబై: ప్రస్తుతం ట్విట్టర్లో ‘గెట్ వెల్ సూన్.. షారుఖ్’ అనే హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కారణం ఏమిటంటే.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కరోనా బారిన పడడమే.
ఇటీవల కరోనా మహమ్మారి లక్షణాలు కనిపించడంతో షారుఖ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు కలవరపాటుకు గురయ్యారు.
‘గెట్ వెల్ సూన్ ఎస్ఆర్కే’ అనే హ్యాష్ట్యాగ్ జత చేస్తూ వారు ట్విట్టర్లో వరుస పోస్టులు పెడుతున్నారు. క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ‘‘షారుఖ్.. మీరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..’’ అంటూ ట్వీట్ చేశారు.
ఆ ‘పార్టీ’యే కారణమా?
ఇదిలా ఉండగా.. షారుఖ్ ఖాన్ కరోనా బారిన పడ్డారని తెలిసిన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఎందుకంటే.. ఇటీవల బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్జోహార్ బర్త్డే పార్టీ ఏర్పాటు చేయగా.. ఆ పార్టీకి షారుఖ్ ఖాన్తోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
అంతేకాదు, ఈ పార్టీలో పాల్గొన్న వారిలో చాలామంది కరోనా బారిన పడ్డారంటూ ఆదివారం ఉదయం నుంచి పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు రావడం కూడా అందరిలో ఆందోళన కలిగిస్తోంది.