విజయవాడ: గతేడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే విఫలమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన సర్వే వివరాలని వెల్లడించారు.
ఈ సర్వే కూడా వాస్తవ ఫలితాలను ఏమాత్రం చేరుకోలేకపోయాయి. ఏపీలో టీడీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పిన లగడపాటి అంచనాకు పూర్తి భిన్నంగా వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది.
దీంతో లగడపాటి సర్వేలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లగడపాటి స్పందించారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తన సర్వేలు లెక్క తప్పాయని, ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలన్న లగడపాటి, 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ వచ్చానని, ఎటువంటి పక్షపాతం లేకుండా అనేక సందర్భాల్లో ప్రజల నాడి తెలిపానని గుర్తుచేశారు. కాబోయే ముఖ్యమంత్రిగా జగన్కి శుభాకాంక్షలు తెలుపుతూ… ప్రతిపక్షనేతగా చంద్రబాబు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు.