కొడంగల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మంగళవారం తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల ప్రకారం.. తెలంగాణలో టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో దూసుకుపోతోంది. మరోవైపు కొడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా తన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
తన ఓటమిపై ఆయన స్పందించారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో కూర్చుని చర్చిస్తామని రేవంత్ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా? టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందా? అనే విషయాలు సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ఉండి పోరాడతామన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తామన్నారు.