హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అవినీతి ఖాకీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షాత్తూ డీజీపీ కార్యాలయమే రాష్ట్ర వ్యాప్తంగా 391 మంది అవినీతి ఖాకీలను గుర్తించడమేకాక వారి జాబితాను కూడా విడుదల చేసింది. ఉన్నతాధికారుల ఈ చర్యతో అవినీతి ఖాకీల్లో కలవరం మొదలైంది.
అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో అవినీతి ఖాకీలు ఉన్నట్లు బయటపడింది. ఐడీ, క్రైం, స్పెషల్ పార్టీల పేరుతో మామూళ్లు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానిస్టేబుళ్ల చేత మామూళ్లు వసూలు చేయిస్తున్న సీఐలు, ఎస్ఐలు, ఇతర అధికారుల పేర్లను డీజీపీ కార్యాలయం గురువారం వెల్లడించింది.
అంతేకాదు, వీరిపై చర్యలు తీసుకునేందుకు డీజీపీ మహేందర్రెడ్డి సిద్ధమయ్యారు. అవినీతి ఖాకీలను తక్షణమే బదిలీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మొత్తంమ్మీద డీజీపీ ఉత్తర్వులు తెలంగాణ పోలీసు శాఖలో, అవినీతికి అలవాటుపడిన ఖాకీల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది.