
హైదరాబాద్, 7 సెప్టెంబరు 2026: తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో.. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, అలాగే హైదరాబాద్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడవచ్చని తెలియజేసింది.
వాతావరణ శాఖ మొత్తం 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ల వద్ద ఉండవద్దని ప్రజలకు సూచించింది.
కొనసాగుతున్న అల్పపీడనం…
ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా కదిలే అవకాశం ఉందని, అలాగే మరో రుతుపవన ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపింది.
ఈ తీవ్ర అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణలోనే కాక అటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కొన్ని రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.








