ఇండియా నీ అయ్య జాగీరా? నీ తాత జాగీరా?: మోడీపై.. కేసీఆర్ నిప్పులు

kcr-slams-narendra-modi-1
- Advertisement -

kcr-slams-narendra-modi

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నిప్పులు కురిపించారు. బుధవారం నారాయణ్ ఖేడ్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇండియా నీ అయ్య జాగీరా? లేకపోతే నీ తాత జాగీరా? ఎందుకివ్వవు రిజర్వేషన్లు అంటూ మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రంలో ముస్లిం, గిరిజనులు జనాభా పెరిగిందని… అందుకే వారికి 12 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని కేసీఆర్ చెప్పారు.

ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్ల అంశంపై మాట్లాడానని, కేంద్రానికి 33 లేఖలు కూడా రాశారని తెలిపారు. అయినా సరే.. రిజర్వేషన్ల శాతాన్ని పెంచేది లేదంటూ ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు కాదని, ఫెడరల్ ఫ్రంట్ రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

కేంద్రంలో మనం చక్రం తిప్పాలంటే…

కేంద్రంలో మనం చక్రం తిప్పాలంటే 17 ఎంపీ సీట్లు టీఆర్ఎస్‌‌కు రావాలని, హైదరాబాదులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కచ్చితంగా గెలుస్తారని… మరో 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంటే కేంద్రం మెడలు వంచి మన డిమాండ్లు సాధించుకోవచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఇప్పటికే తాను జాతీయ స్థాయిలో ఉన్న పలువురు నేతలతో మాట్లాడానని… అందరం కలుస్తామని చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అని కేసీఆర్ ఉద్ఘాటించారు. అసలు చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో కరెంట్ ఉండేది కాదని, ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తరువాత… ఇప్పుడు 24 గంటలూ కరెంట్ ఉంటోందని చెప్పారు.

మహాకూటమి గనుక అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు సమస్య వస్తుందని తెలిపారు. ఏ బాధలు లేకుండా ఉండాలంటే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీని తిరిగి అఖండ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

- Advertisement -