హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడంలో భాగంగానే కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తన ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ ఇదంతా కేసీఆర్ పన్నాగమేనన్నారు.
చదవండి: 22 ఏళ్లుగా ఆ ఇంటిని లీజుకు ఇస్తున్నాం.. అక్కడున్న కాంపెనీలన్నీ నావేనా?: మండిపడ్డ రేవంత్ రెడ్డి
జగ్గారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వెంకట రమణారెడ్డితో పాటు తాజాగా తనను కూడా కేసీఆర్ టార్గెట్ గా చేసుకున్నారని రేవంత్ విమర్శించారు. ఓ వింత జంతువు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, అది కేసీఆర్ ఉసిగొల్పినదేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఆస్తుల విలువ అలా పెరిగిందే తప్ప…
2007లో తొలిసారిగా తాను శాసన మండలికి ఎన్నికయ్యాయని రేవంత్ చెప్పారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను తన ఆస్తుల కొన్న విలువను ప్రకటించానని వెల్లడించారు. అప్పుడు ఆస్తుల విలువ రూ. 2-3 కోట్లుగా ఉందని, 2014 ఎన్నికలప్పుడు ఆస్తుల మార్కెట్ విలువను ప్రకటించాలని ఎన్నికల సంఘం సూచించిందని, ఆ ప్రకారం తన ఆస్తుల విలువ ఒక్కసారిగా రూ.12-14 కోట్లకు చేరుకుందని ఆయన వివరించారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశముందనీ, ఇందులో వింత ఏముందని రేవంత్ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో పాతికేళ్ల క్రితం బంజారాహిల్స్లో రూ.25 లక్షలకు కొన్న ఇంటి విలువ ప్రస్తుతం కోట్ల రూపాయల్లోకి వెళ్లిపోయిందన్నారు.
ఈ మాత్రం కూడి అర్థం చేసుకోలేని, కేసీఆర్ తిని పారేసే బొక్కలు ఏరుకునే సన్నాసులు తనపై విమర్శలు చేస్తున్నారని రేవంత్దు రెడ్డి ఎద్దేవా చేశారు. 2014లో తన పేర ఉన్న ఆస్తులను 2009లో ఉన్నవాటితో పోల్చి చూడాలని, అప్పుడు వారికే అర్థమవుతుందని ఆయన సూచించారు.