
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈసారి అదిరిపోయే ఫీచర్తో వస్తోంది.
ఇప్పటికే పేమెంట్స్ ఫీచర్ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. ఇప్పుడు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అర్హులైన వాట్సాప్ యూజర్లు అందరికీ రుణాలు ఇస్తూ వారి అవసరాలు తీర్చాలని నిర్ణయించింది.
ఇందుకు సబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెల మొదట్లో రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ విషయాన్ని పేర్కొంది.
అయితే, కంపెనీ బ్యాంకింగ్ వ్యాపారం చేయకుండా చట్టబద్ధమైన అడ్డంకులు ఉండడం వల్ల ప్రస్తుతం ఉన్న బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పరచుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.
2018లో వాట్సాప్ 10 లక్షల మంది వినియోగదారులతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత సేవలు ప్రారంభించింది.
ఆ తరువాత, ఈ ప్రాజెక్ట్ నియంత్రణ పరిమితుల కారణంగా ఆగిపోయింది. గత సంవత్సరం చివరి నాటికి సేవలను ప్రారంభించాలని భావించింది.
అయితే, అధికారుల నుంచి అనుమతి పొందడంలో విఫలమైంది. తదుపరి దశలో 10 మిలియన్ల మంది వినియోగదారులకు వాట్సాప్ చెల్లింపులు చేస్తామని ఫిబ్రవరిలో వాట్సాప్ పేర్కొంది.
అయితే, ఈ నెల ప్రారంభంలో ‘టెక్ క్రంచ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫేస్బుక్ ఇండియా హెడ్ అజిత్ మోహన్ మాట్లాడుతూ చెల్లింపుల యూజర్బేస్ ఇంకా ఒక మిలియన్గా ఉన్నట్టు పేర్కొన్నారు.
దేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులతో వాట్సాప్.. డిజిటల్ చెల్లింపుల రంగంలో పేటీఎం, ఫోన్పే, గూగుల్ పేలకు ప్రత్యర్థిగా నిలిచేందుకు గొప్ప అవకాశం ఉంది.
క్రెడిట్ సూయిస్ ప్రకారం.. భారతీయ డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ 2023 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.








