సినిమా హీరోలు కాదు.. ఒక్కసారి ఈ ‘రియల్ హీరో’ గురించి తెలుసుకోండి!

raju-narayana-swamy
- Advertisement -

raju- narayana- swamy

తెలుగు ప్రేక్షకుడు తన ఫ్యామిలీతో కలిసి ఒక సినిమాకి వెళ్లాడు. దర్జాగా థియేటర్ లో కూర్చున్నాడు. ఏసీ వేశారు.. చల్లగా తగులుతోంది.. కాళ్లు ఎదుటిసీటుపై బార్లా తన్ని పెట్టాడు. సినిమా మొదలైంది.. హీరో ఎంట్రన్స్.. ఒక్కసారి మనోడు అటెన్షన్ లోకి వచ్చేశాడు.. ఎందుకంటే అక్కడ ఆ హీరోయే మనోడన్నమాట.. ఏరియల్ వ్యూ కనిపిస్తోంది. ఒక్కసారి తెరపై కెమెరా వేగంగా పరిగెత్తడం మొదలైంది.

ఎందుకంటే అక్కడంతకన్నా వేగంగా మన హీరో బైక్ పై హీరోయిన్ ని తీసుకొని పారిపోతున్నాడు. ఒక సెకను తర్వాత.. ఆ బైక్ ని ఫాలో అవుతూ విలన్ జీపులు..రయ్..రయ్ మంటూ హారన్లు కొట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. మనోడి చేతులు సీటుపై బిగుసుకున్నాయి. ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు.

ఒకవైపు నుంచి టైటిల్స్ పడుతున్నాయి. హీరో సడన్ గా సందులోకి తిప్పాడు.. అక్కడ చీరలన్నీ వరుసగా ఆరబెట్టి ఉన్నాయి.. అంతే అందులోకి వెళ్లి మళ్లీ కనిపించలేదు. కానీ కట్ చేస్తే.. న్యూజిలాండ్ లో మంచుకొండల్లో ప్రత్యక్షం.. అక్కడో సాంగ్, డ్యూయెట్.. అప్పడు హీరోయిన్ ని చూస్తాడు. పక్కనే తన భార్యని చూస్తాడు. మళ్లీ హీరోయిన్ తో పాట పాడేందుకు వెళ్లిపోతాడు..

ఈసారి మళ్లీ కట్ చేస్తే…మన  అచ్చింపేట సంత దగ్గర సీన్ వచ్చేస్తుంది. ఎక్కడ నుంచి చూస్తున్నారో తెలీదు.. విలన్లు వచ్చేస్తారు.. అందరినీ సింగిల్ హ్యాండ్ తో ఎగిరిగెరి తంతాడు.. మనోడు కుర్చీలో కూడా ఎగిరెగిరి పడుతుంటాడు.. అదీ తన్ను.. అలా తన్నాలి.. హ్హ..హ్హ..హ్హ.. అనుకుంటాడు మనసులో..

ఇదండీ తెలుగు సినిమా స్టయిల్.. ఇది తెలుగువాడి హీరో క్యారెక్టర్.. అతనిలాగే ఉండాలి.. ఆ రెండున్నర గంటలు హీరోని చూస్తాడు. తనలో చూసుకుంటాడు. బయటకు వచ్చేస్తాడు. కానీ రియల్ లైఫ్ లో వచ్చే ఏ హీరోని మాత్రం గుర్తించలేని గుడ్డివాడుగానే ఉండిపోతాడు. ఎందుకంటే వీడికి ఊహ కావాలి. అది వాస్తవంలోకి వస్తే.. తట్టుకోవడానికి ప్రేక్షకుడి శక్తి సరిపోదు.

ఎందుకంటే బలహీనమైన గుండె కలవారు.. మనవాళ్లు.. అందుకే ఎలా తిరిగి వెళ్లిపోయాడో.. ఈ ‘రియల్ హీరో’ని చూడండి.. అతన్ని కాపాడుకోలేని మన భారతదేశ దయనీయ స్థితిని చూడండి.. ఈ వాట్సాప్ కథనం చదవండి.

ఇదీ అసలు కథ…

1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష రాశాడు. స్టేట్ ఫస్ట్….!

1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష … స్టేట్ ఫస్ట్….!

ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాస్తే … మళ్లీ స్టేట్ ఫస్ట్….!

1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు.. బ్యాచ్ ఫస్ట్…!

అదే ఏడాది ‘GATE’ పరీక్ష.. మళ్లీ ఫస్ట్ రాంక్….!

ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు.. మళ్లీ ఫస్ట్ ర్యాంక్….!

ఐఏఎస్ శిక్షణలో.. మరోసారి ఫస్ట్….!

ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతివాచీ పరిచి, గ్రీన్ కార్డు వీసా ఇచ్చి, పచ్చజెండా ఊపి మరీ మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటు ఇచ్చింది!

మరి… మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే! మనవాడు మాత్రం ‘నా చదువుకు నా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది, ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు! ప్రజల డబ్బంటే పేదల చెమట… వాళ్ల రక్తం… వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులే… నన్ను చదివించాయి! అలాంటిది ఆ పేదల స్వేదాన్ని, జీవన వేదాన్ని వదిలి నేను అమెరికా వెళ్లడం ఏమిటి?’ అనుకున్నాడు.

ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష రాసి ఐఏఎస్ అయ్యాడు.  చిన్నప్పటినుంచీ నేర్చుకున్న విలువలు పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన… వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు.  అతని పేరే-రాజు నారాయణ స్వామి! కేరళలోని పాల్ఘాట్‌కి చెందిన వాడు.

అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి. ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది!ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది.  ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది.

ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. “నా అల్లుడు కలెక్టర్, నన్నేం చేయలేరు..” అనుకున్నాడు.

మన కలెక్టర్ గారు ఆ భవనాన్ని కూల్చి వేయించారు. కోపంతో మామ భగ్గుమన్నాడు. భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలి వెళ్లిపోయింది.

ఆ తరువాత రాజు నారాయణస్వామి పన్నులు ఎగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు. ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు.

కలెక్టర్ గారు అవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు.

అంతే … మళ్లీ ట్రాన్స్ ఫర్… మళ్లీ కొత్త ఊరు… కొత్త పని…!

కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం, బిల్లులు వసూలు చేసుకోవడం ఆ తరువాత వానలు పడటం… వానకి గట్టు కొట్టుకుపోవడం….

మళ్లీ టెండర్లు… మళ్లీ పనులు… మళ్లీ బిల్లులు… మళ్లీ వానలు… ఇదే తంతు కొనసాగేది.

రాజు నారాయణ స్వామి…. దీన్ని అడ్డుకున్నారు. ‘వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు…. ఇచ్చేది ‘ అన్నాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు.

మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు. అంతే..! మళ్లీ పాత కథ పునరావృతం అయింది. చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి ‘అచ్యుతా నందన్’ మన రాజునారాయణ స్వామిని ఎలాంటి ప్రాధాన్యతాలేని ఓ విభాగంలో పారేశారు.

చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ‘ఐక్యరాజ్య సమితి’ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. ‘మా దగ్గర పని చేయండి’ అని కోరుతూ పిలువు వచ్చింది.

ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్‌లో పనిచేయడానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు!

రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు. ఆయన 23 పుస్తకాలు రాశారు.

వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన వ్రాసిన నవలకు ‘సాహిత్య అకాడెమీ’ అవార్డు కూడా వచ్చింది.

ఆయన రాసిన నవలల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.

ఇదీ మన దేశ ప్రజలు అందరూ ఆలోచించాల్సిన విషయం.  తిట్టుకోవడం కాదు.. అతనిలా.. ఇతనిలా కాదు.. ఒకసారి ఆలోచించండి.. నిజాలు గ్రహించండి.. ఓటేసినప్పుడు ఆలోచించి వేయండి.. అదొక్కటి చాలు.. మనదేశ భవిష్యత్తు మన చూపుడు వేలిపై పడే సిరా గుర్తుపై ఉంది… జైహింద్.

-శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -

1 COMMENT