శబరిమల వివాదం: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఏమన్నారంటే…

tamil-superstar-rajini-kanth
- Advertisement -

rajanikanth2

చెన్నై: శబరిమల ఆలయంలో ఎన్నోఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ పేర్కొన్నారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తను స్వాగతిస్తున్నట్లు చెబుతూనే… ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఎంతో సున్నితమైన అంశమని ఆయన  పేర్కొన్నారు.

తాను నటిస్తున్న ‘పేట్టా’ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ లక్నో నుంచి విమానంలో చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు అవసరం లేదు, అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచారం ఎన్నో సంవత్సరాలుగా ఉంటోంది, అది నమ్మకానికి సంబంధించిన వ్యవహారం. ఇలాంటి విషయల్లో జోక్యం చేసుకోవడం సరికాదు..’’ అని అన్నారు.

దేశంలో సంచలనం సృష్టిస్తున్న ‘#మీటూ’ వివాదంపై కూడా రజనీకాంత్ స్పందించారు. ‘‘ఈ ఉద్యమంతో మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది.. అయితే దీనినెవరూ దుర్వినియోగం చేయకూడదు.. ఈ #మీటూను బాధిత మహిళలు సరైన రీతిలో వినియోగించుకోవాలి..’’ అన్నారు.

వైరముత్తుపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కూడా సూపర్‌స్టార్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఆయన తోసిపుచ్చారని,  తన నిర్దోషిత్వాన్ని  నిరూపించుకుంటానని తెలిపారని, అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కూడా వైరముత్తు చెప్పారని గుర్తు చేశారు.

డిసెంబర్ 12న తన పార్టీ, ఎజెండాను ప్రకటిస్తానని తానెక్కడా  చెప్పలేదని  మరోవిషయమై రజనీకాంత్ తెలిపారు.

- Advertisement -