

అహ్మదాబాద్: ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు.
సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని మోడీ నివాళులర్పించారు. గుజరాత్లో నర్మదా జిల్లాలోని సర్ధార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న సాధు బెట్లో ఈ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని నిర్మించారు.
2013 అక్టోబర్ 31 న ప్రధాని మోడీ ఈ ఐక్యతా విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా గుర్తింపు పొందింది.
విగ్రహం లోపల గ్యాలరీ…
ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సర్ధార్ డ్యామ్ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు.
దేశంలోని 30 పవిత్ర నదీ జలాలతో సర్ధార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. 37 మంది సర్ధార్ పటేల్ కుటుంబ సభ్యులు ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం చేపట్టారు.
ఐక్యతా విగ్రహం విశేషాలు..
విగ్రహ నిర్మాణానికి అయిన ఖర్చు – రూ. 2979 కోట్లు
విగ్రహం ఎత్తు : 82 మీటర్లు (597 అడుగులు )
విగ్రహనికి వాడిన మొత్తం మెటీరియల్..
33,550 టన్నుల ఇత్తడి.
6 వేల స్ట్రక్చరల్ స్టీల్.
18 వేల టన్నుల రీ ఇన్ఫోర్స్డ్ స్టీల్.
2 లక్షల 12 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్..
300 మంది ఇంజనీర్లు.. 3400 మంది పనివాళ్లు పని చేశారు.
3 సంవత్సరాల 9 నెలలపాటు విగ్రహ నిర్మాణం జరిగింది.
విగ్రహం ప్రత్యేకతలు…
6.5 తీవ్రతతో భూకంపం సంభవించినా ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది.
గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరని విధంగా రూపొందించారు.








