బీజేపీ అగ్రనేత, కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వాణీ(90)ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కలిసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఎన్డీయే నుంచి ప్రాంతీయ రాజకీయ పార్టీలు వైదొలగడంపై వారు అద్వానీతో చర్చించినట్లు పశ్చిమ బెంగాల్కు చెందిన ఆనంద్బజార్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్డులో ఉన్న అద్వానీ నివాసానికి వెళ్లిన మోడీ, అమిత్ షాలు టీడీపీ.. ఎన్డీయేను విడటం, మహారాష్ట్రలో శివసేన, బీహార్ జేడీయూలు ఎన్డీయేపై అసంతృప్తితో ఉండటం తదితర విషయాలపై చర్చించినట్లు ఆ పత్రిక పేర్కొంది. అలాగే ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉప ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించటంపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. అంతేకాదు, 2019 లోక్సభ ఎన్నికల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు పోటీ చేయాలని కూడా మోడీ, షాలు కోరినట్లు ఆనంద్బజార్ వెల్లడించింది.