
భువనేశ్వర్: కోవిడ్-19 విధుల్లో ఉంటూ ప్రాణాలు విడిచిన హెల్త్ కేర్ సిబ్బందికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందన్నారు. ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించిన సీఎం.. దాడులకు పాల్పడే వారిపై జాతీయ భద్రత చట్టం (ఎన్ఎస్ఏ) కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాడుతూ చనిపోయిన ఆరోగ్య సిబ్బందిని అమరులుగా గుర్తించడంతోపాటు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
అలాగే, వారికి జాతీయ దినాల్లో అవార్డులు అందిస్తామని, ఇందుకోసం వివరాణత్మక అవార్డుల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.
అంతేకాదు, ప్రభుత్వ సిబ్బంది (మెడికల్, ఇతర సిబ్బంది) కుటుంబాలకు రిటైర్మెంట్ తేదీ వరకు పూర్తి వేతనాన్ని అందించనున్నట్టు చెప్పారు.
వైద్యులు, ఆరోగ్య నిపుణులు, ఇతర సిబ్బంది అందిస్తున్న నిస్వార్థ సేవలకు మనంతా కృతజ్ఞతగా ఉండాలని అన్నారు.
వారిపై జరుగుతున్న దాడులను సహించబోమని, అటువంటి వారిపై ఎన్ఎస్ఏ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని నవీన్ పట్నాయక్ హెచ్చరించారు.








