పీఎస్ఎల్వీ సీ44 విజయవంతం: కక్ష్యలోకి మిలిటరీ శాటిలైట్, విద్యార్థులకు ఇస్రో పిలుపు

pslv c44
- Advertisement -

శ్రీహరికోట(నెల్లూరు): సతీష్ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి గురువారం అర్ధరాత్రిటనింగిలోకి పంపిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ44 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగింది.

గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ44 నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన 1.2 కిలోల బరువున్న కలాంశాట్‌తోపాటు 740 కిలోల మైక్రో శాట్‌-ఆర్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. కలాంశాట్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. మైక్రోశాట్‌-ఆర్‌ దేశ రక్షణ రంగ(మిలిటరీ) అవసరాల కోసం(డీఆర్‌డీవో) పంపారు. దీనికి డీఆర్‌డీఏ వారు పెలోడ్లను సమకూర్చారు.

షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ బయలుదేరాక 13 నిమిషాల అనంతరం 274 కిలోమీటర్ల ఎత్తులో మైక్రోశాట్‌ ఉపగ్రహాన్ని విడిచిపెట్టింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ సిరీస్‌లో ఇది 46వ వాహకనౌక. దీనిని పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌గా పిలుస్తున్నారు.
వాహకనౌకలోని పీఎస్‌4 దశను కక్ష్యలో ఆర్బిటాల్‌ ప్లాట్‌ఫాంలా ఉపయోగపడేందుకు అంతరిక్షంలోనే ఉంచనున్నారు. పీఎస్‌4 దశలో లిథియం ఆయాన్‌ బ్యాటరీలు అమర్చారు.

పీఎస్‌4 దశను ఎత్తయిన సర్క్యులర్‌ ఆర్బిట్‌కు పంపనున్నారు. దాన్ని అంతరిక్షంలో ఉంచి మరికొన్ని అంశాలపై అధ్యయనం చేయనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ44 వాహకనౌకలో బరువును తగ్గించి పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి నాలుగో దశలో అల్యూమినియం ట్యాంకును వినియోగించారు.

ఇస్రోలో విద్యార్థులు ప్రయోగాలు చేసుకోవచ్చు

ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ మాట్లాడారు. విద్యార్థులు ఉపగ్రహాలు తయారుచేసుకుని, వాటిని ఇస్రోకు తీసుకువచ్చి ప్రయోగించవచ్చని సూచించారు. ప్రస్తుతం తమిళనాడు విద్యార్థులు తయారుచేసిన కలాంశాట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేర్చామంటూ విద్యార్థులను అభినందించారు. పీఎస్ఎల్వీ సీ44 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

- Advertisement -