

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్పై అన్ని రకాల ప్రతీకార చర్యలు తీసుకుంటోంది భారత్. ఇరవై మూడేళ్ల క్రితం పాకిస్తాన్కు ఇచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను రద్దు చేయడం, దిగుమతి సుంకంను 200 శాతం పెంచడం వంటి కఠిన నిర్ణయాలను ఇప్పటికే తీసుకుంది. పుల్వామా దాడికి పాల్పడింది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్.
చదవండి: పుల్వామా ఉగ్రదాడి: విషం కక్కిన పాకిస్తాన్ మీడియా, ఆ ఉగ్రవాదులు స్వాతంత్ర్య సమరయోధులట!
జైష్ చీఫ్ మసూద్ అజహర్ను పాక్లో స్వేచ్ఛగా తిరగనిస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తాజాగా ఈ ప్రకటన చేశారు. పాకిస్తాన్కు నీటి విడుదలను ఆపేయాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఇక మన రాష్ట్రాలకే ఆ నీరు
భారత్ నుంచి పాక్ వెళ్లే నీటిని ఇక మనమే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఇండస్ నదీ జలాలు దాయాది దేశానికి వెళ్లవని చెప్పారు. ఈశాన్య ప్రాంతం నుంచి పాక్కు వెళ్లే నీటిని మన కోసం తరలిస్తామని చెప్పారు. తద్వారా జమ్ము కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల ప్రజలకు ఈ నీటిని ఉపయోగిస్తామని తెలిపారు.
రావి నది పైన షహపూర్ – కంది ప్రాజెక్టు ప్రారంభమైందని గడ్కరీ పేర్కొన్నారు. అలాగే, యూజేఎహెచ్ ప్రాజెక్టులు మన భాగానికి వచ్చే నీటిని స్టోర్ చేస్తాయని, వాటిని జమ్ము కాశ్మీర్ కోసం ఉపయోగిస్తామని, మిగిలిన నీటిని ఇతర తీర ప్రాంత రాష్ట్రాలకు తరలిస్తామని చెప్పారు.
అంతేకాదు, రావి – బియాస్ ద్వారా పరీవాహక ప్రాంతాలకు అందిస్తామని, అన్ని ప్రాజెక్టులు కూడా నేషనల్ ప్రాజెక్టులుగా డిక్లేర్ చేశామని, ఇక్కడి నుంచి పారే నదీ జలాలపై పూర్తి హక్కులు భారత్వేనని నితిన్ గడ్కరీ తెలిపారు.
కాగా, సింధు ఒప్పందం ప్రకారం.. సింధు బేసిన్లోని ఆరు నదులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై భారత్ – పాకిస్తాన్ దేశాలు అప్పట్లో సర్దుబాట్లు చేసుకున్నాయి. ఈ ఆరింటిలోని మూడు నదులపై భారత్కు, మూడు నదులపై పాకిస్థాన్ హక్కులు పొందింది. దీనిని ఇండస్ వాటర్స్ ట్రీటీ అంటారు.
ఈ నదులని తూర్పు, పశ్చిమ నదులు అంటారు. 1960లో చేసుకున్న ధ్వైపాక్షిక ఒప్పందం ప్రకారం.. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. అలాగే, జీలం, చీనాబ్, సింధు నదులపై పాకిస్థాన్కు పూర్తి హక్కులు ఉన్నాయి.
నీళ్లు ఆపితే నష్టమేం లేదన్న పాకిస్తాన్…
ఇది ఇలా ఉండగా, భారత్.. తమకు నీళ్లు రాకుండా చేసినా.. ఏం నష్టం లేదని పాకిస్తాన్ చెప్పడం గమనార్హం. భారత్ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని పాక్ నీటిపారుదల శాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పాక్ పత్రిక ‘డాన్’కు ఆయన వెల్లడించారు.








