
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,334 కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,712కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
చదవండి: అమెరికాలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 4,591 మంది మృతి
ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 24 గంటల్లో కొత్త కేసుల నమోదుతోపాటు దేశ వ్యాప్తంగా 27 మంది మరణించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కోవిడ్19 మృతుల సంఖ్య 507కు చేరుకున్నట్లు చెప్పారు.
కరోనా వ్యాప్తి కట్టడికి, రోగుల చికిత్స కోసం దేశంలో 755 ఆసుపత్రులు పని చేస్తున్నాయని, ప్రత్యేకంగా 1389 హెల్త్కేర్ సెంటర్లు కూడా పనిచేస్తున్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా సోకిన వారిలో చికిత్స అనంతరం ఇప్పటి వరకు 14.19 శాతం మంది కోలుకొన్నట్లు చెప్పారు.
మే 3 వరకు.. అవన్నీ బంద్!
మే 3వ తేదీ వరకు దేశంలో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేసే ఉంటాయని, అలాగే రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు వంటి వాటిపైనా నిషేధం కొనసాగుతుందన్నారు.
మరోవైపు రోజువారీ కూలి పని చేసుకునే కార్మికులు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్న వారు ఆ రాష్ట్రంలోనే ఉండాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూలీలు రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రయాణించే అవకాశం కల్పించకూడదని సూచించారు.
చదవండి: లాక్డౌన్ ఆంక్షలు: సడలింపా? కొనసాగింపా? ప్రగతిభవన్లో టీఎస్ క్యాబినెట్ భేటీ ప్రారంభం…
కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి వ్యాక్సిన్ తయారీ కోసం కూడా ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు.








