వేతనాల పెంపు కోరూతూ కొన్ని రోజులుగా ఆందోళను చేస్తున్న పోస్ట్మ్యాన్, గ్రామీణ ఢాక్ సేవక్లకు కేంద్రం ఎట్టకేలకు తీపి కబురు వినిపించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న 2 లక్షల 60 వేల మంది పోస్ట్మ్యాన్ల బేసిక్ శాలరీని మూడు రేట్లు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది.
దీంతో ఇప్పటివరకు నెలకు రూ.2,295 బేసిక్ శాలరీ తీసుకుంటున్న గ్రామీణ పోస్ట్మ్యాన్లు ఇకపై రూ.10000 వేతనాన్ని అందుకుంటారు. నెలకు రూ.2,745 బేసిక్ శాలరీ తీసుకుంటున్న వారు ఇక పై రూ.12000 వేతనాన్ని అందుకుంటారు. నెలకు రూ.4 ,115 బేసిక్ శాలరీ తీసుకుంటున్నవారు ఇక పై రూ.14500 జీతంగా తీసుకుంటారు అని కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అంతేకాదు, వీరి వేతనాలను ఏటా మూడు శాతం పెంచాలని కూడా కేంద్రం నిర్ణయించిందని అయన ప్రకటించారు.
అలాగే.. ఆఫీస్ నిర్వహణ అలవెన్స్, ఉమ్మడి విధుల అలవెన్స్, క్యాష్ కన్వే చార్జీలు, వీటితొపాటు సైకిల్ మెయింటినెన్స్ అలవెన్స్ గతంలో రూ.50 రూపాయిలు ఉండగా, ప్రస్తుతం దీనిని రూ.115 రూపాయిలకు పెంచారు. ఫిక్సడ్ స్టేషనరీ చార్జీలు కూడా పెంచినట్లు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.
అంతేకాదు, ఈ పెంపు 2016 జనవరి నుంచి అమలులోకి వస్తుందని, పోస్టల్ శాఖ ఉద్యోగులందరూ తిరిగి తమ విధులలోకి వెళ్ళాలని అయన కోరారు. దేశంలో పోస్టల్ శాఖ ముఖచిత్రం మారుతోందని, త్వరలోనే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలు కూడా ప్రారంభం కానున్నాయని మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.