న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ఇదొక శుభవార్త. ముఖ్యంగా ఉద్యోగ బదిలీల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారికి ఇదొక గొప్ప ఉపశమనం. ఎందుకంటే.. ఇకనుంచి దేశవ్యాప్తంగా ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2019 జులై నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.
ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే మొదలుపెట్టింది. కొత్తగా జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్లను పొందుపరచనున్నారు. కార్డు వివరాలను వేగంగా గుర్తించడానికి వీటిల్లో ‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్’ (ఎన్ఎఫ్సీ) ఫీచర్ను కూడా తీసుకురానున్నారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో…
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన రంగు, ఒకే విధమైన డిజైన్, ఒకే రకమైన సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన కొత్త డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాదు, కొత్త లైసెన్స్పై డ్రైవర్ అవయవదానం చేస్తామంటూ ఇచ్చే డిక్లరేషన్ వివరాలు పొందుపరుస్తారు.
దేశ వ్యాప్తంగా రోజుకు 32,000 కొత్త డ్రైవింగ్ లైసెన్సుల జారీ లేదా రెన్యూవల్ జరుగుతున్నాయి. రోజుకు 43,000 వాహనాలు కొత్తగా రిజిస్టర్ లేదా రీ-రిజిస్టర్ అవుతున్నాయి. జులై నుంచి వీరందరికీ కొత్తగా ప్రవేశపెట్టిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను రవాణాశాఖ జారీ చేయనుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగనుంది. ఈ కొత్త కార్డుల ధర కూడా రూ.15 – 20 మించకపోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు.