
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అలోక్ రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఢిల్లీలోని సాహిబాబాద్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.
అలోక్ రంజన్ ఘజియాబాద్కు చెందిన వారని, డిప్యుటేషన్పై ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పని చేస్తున్నారని వివరించారు.
ఈడీలో పనిచేయడానికి ముందు ఆయన ఆదాయపన్ను విభాగంలో పని చేసేవారని, ఇటీవల ఓ అవినీతి కేసులో సీబీఐ ఆయన్ని రెండుమార్లు విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే ఆయన నేరానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సీబీఐ అధికారులు ఆయన్ని వదిలేశారని తెలిపారు.
దీనికారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే ఆయన ఆత్మహత్యకు మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇంకా తెలియలేదని, ప్రస్తుతానికి ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు వివరించారు.
చదవండి: Heavy Rains: రోజంతా వానే వాన.. స్కూళ్లు బంద్.. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు!








