హైదరాబాద్: కొత్త నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ మణికొండ జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి మంగళవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆమెతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గౌడ్ను కూడా వారు అరెస్టు చేశారు.
ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్లోని వేంకటేశ్వర కాలనీకి చెందిన బొమ్మ ఉపేంద్రనాథ్ రెడ్డి కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటికోసం రెండు కొత్త నల్లా కనెక్షన్లు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: ED Officer Suicide: షాకింగ్: ఈడీ అధికారి ఆత్మహత్య! అసలేం జరిగింది?
అయితే నల్లా కనెక్షన్లు ఇవ్వాలంటే రూ.30 వేలు ఆమ్యామ్యా సమర్పించుకోవాలంటూ ఒౌట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గౌడ్ చెప్పడంతో తమ దరఖాస్తు సక్రమంగానే ఉన్నా నల్లా కనెక్షన్ ఎందుకు ఇవ్వరంటూ ఉపేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.
అయితే డబ్బులు ఇస్తేనే కనెక్షన్ వస్తుందని చెప్పడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆ తరువాత కథంతా తెలిసిందే. మంగళవారం బాధితుడి వద్ద నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి మేనేజర్ స్ఫూర్తి రెడ్డిని, నవీన్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అధికారులకే చుక్కలు…
మణికొండ జలమండలి మేనేజర్ స్ఫూర్తి రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉండడంతో కొంత కాలంగా ఆమెపై ఏసీబీ అధికారులు కన్నేశారు. ఈ క్రమంలో పుప్పాలగూడలో ఉన్న స్ఫూర్తి రెడ్డి ఇంటిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు అక్రమ ఆస్తులను గుర్తించారు.
అయితే ఏసీబీ అధికారులు ఆమె ఇంటిని గుర్తించే క్రమంలో స్ఫూర్తి రెడ్డి వారికి చుక్కలు చూపించారు. తాను ఉంటున్న ఇంటి చిరునామాను ఆమె వారికి చెప్పలేదు. పైపెచ్చు తప్పుడు చిరునామాలు చెబుతూ అధికారులను ఆమె దాదాపు రెండు గంటలపాటు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు.