
హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ హయాంలోనే ఎన్డీయే అధికారంలోకి రాబోతుందని ఘంటాపథంగా చెప్పిన విషయం తెల్సిందే. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నిటిని కొట్టిపారేస్తూ…సీపీఐ నారాయణ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత మోడీని సినీ ఇండస్ట్రీకి పంపిస్తామని, సినిమాల్లో ఆయన వేషాలు వేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.
బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి భారీగా సీట్లు తగ్గుతాయని జోస్యం చెప్పారు. ఇక తమతోనే కలిసి ఉండకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మోడీ బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు.
అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మోడీ బెదిరింపులకు భయపడలేదని వ్యాఖ్యానించారు.
ఇక నారాయణ పనిలో పనిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన నేతలని టీఆర్ఎస్ లో ఎలా చేర్చుకుంటారని మండిపడ్డారు.








