న్యూఢిల్లీ: తనను ఎన్నికల ప్రచారానికి పిలిచే హిందువుల సంఖ్య రానురాను తగ్గిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ బుధవారం చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగ ఆజాద్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
‘‘నేను యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో ఎంతోమంది పార్టీ అభ్యర్థుల తరఫున నేను ప్రచారం చేశాను. గతంలో నన్ను 95 శాతం హిందూ సోదరులు, 5 శాతం ముస్లిం సోదరులు తమ ప్రచారానికి పిలిచేవారు. కానీ గత నాలుగేళ్లలో నన్ను ప్రచారానికి పిలిచే హిందూ సోదరుల సంఖ్య 20 శాతం వరకు పడిపోయింది. నేను వారి తరఫున ప్రచారం చేస్తే ఓట్లు రావాని వారు చాలా భయపడుతున్నారు. అందుకే నన్ను పిలవడానికి ఇష్టపడటంలేవదు…’ అని గులాంనబీ ఆజాద్ అన్నారు.
అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆజాద్ చాలా విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారించారని విమర్శించింది. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర గురువారం మీడియాతో మాట్లాడారు.
‘‘గులాంనబీ ఆజాద్ను తక్కువ మంది ప్రచారానికి పిలువడానికి.. ఆయన హిందూ, ముస్లింలను వేరుగా చూడటమే కారణమని సంబిత్ పాత్ర ఆరోపించారు. బీజేపీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.