

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తోన్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యు.యు.లలిత్ తప్పుకున్నారు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన 14 పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
గతంలో కల్యాణ్ సింగ్ తరుపున…
గతంలో అయోధ్య భూ వివాదం కేసులో కల్యాణ్ సింగ్ తరుపున జస్టిస్ లలిత్ వాదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఉండటంపై న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జస్టిస్ లలిత్ తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దీంతో ఈ కేసు విచారణ జనవరి 29కి వాయిదా పడింది. జస్టిస్ లలిత్ స్థానంలో మరొకరిని రాజ్యాంగ ధర్మాసనంలో చేర్చే వరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం కేసు విచారణను చేపట్టనుంది.
చదవండి: అయోధ్య కేసు: రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణ జనవరికి వాయిదా…








