
ఢిల్లీ: ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ సీట్లని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్డీయే 353 సీట్లు సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్డీయేలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. తాజాగా అమిత్ షాను వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కలిశారు.
ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డిని ఎన్డీయేలోకి రావాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారని, దీనిపై చర్చిద్దామని అమిత్ షా చెప్పినట్టు తెలిసింది.
ఒకవేళ వైసీపీ ఎన్డీయేలో చేరితే.. ఆ పార్టీకి రెండు మంత్రిపదవులు కూడా ఇస్తామని అమిత్ షా ప్రతిపాదించారని, పౌర విమానయాన శాఖతో పాటు మరో సహాయమంత్రి పదవిని కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, దీనిపై పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని జగన్ మోహన్ రెడ్డి అమిత్ షాకు చెప్పినట్టు తెలుస్తోంది.








