
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో చిక్కకుపోయిన విదేశీయులను బయటకు పంపేందుకు ఈ నెల 4 నుంచి ఏడో తేదీ మధ్య ఎయిరిండియా ప్రత్యేక విమానాలను నడపనుంది.
ఏప్రిల్ 14 వరకు భారత్లో లాక్డౌన్ అమల్లో ఉంది. అప్పటి వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది.
అయితే, అప్పటి వరకు డీజీసీఏ అనుమతితో సరుకు రవాణా విమానాలు, ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి.
ఏప్రిల్ 4-7 మధ్య ఢిల్లీ-లండన్ మధ్య నాలుగు ప్రత్యేక విమానాలను నడపనున్నట్టు ఎయిరిండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అలాగే, ఏప్రిల్ 5-7 మధ్య ముంబై-లండన్ నగరాల మధ్య కూడా ప్రత్యేక విమానాలు నడపనున్నట్టు పేర్కొన్నారు.
లండన్ వెళ్లే విమానాలు తిరుగు ప్రయాణంలో అక్కడి భారతీయులను వెనక్కి తీసుకొస్తాయా? అన్న ప్రశ్నకు.. అలా జరిగే అవకాశం లేదని బదులిచ్చారు.
ఇప్పటి వరకు అయితే విమానాలు ఖాళీగానే వెనక్కి వస్తాయని, భారతీయులను తీసుకొచ్చే ప్రణాళికేదీ లేదని ఆయన వివరించారు.








