తిరుచ్చి: అఘోరాగా మారిన కొడుకు తన కన్నతల్లికి చాలా అరుదైన రీతిలో అంత్యక్రియలు జరిపాడు. ఈ క్రియలో అతనికి మరికొంత మంది అఘోరాలు కూడా తోడుగా వచ్చారు. అందరూ కలిసి స్మశానంలో విచిత్రమైన పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామస్తులు ఇళ్ళ నుండి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. ఈ వింత ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్ళితే… తిరుచ్చి జిల్లాలోని తిరువెరుంబూర్ సమీపంలోని అరియమంగళంలో మేరి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు మణికంఠన్ వారణాసి వెళ్ళి అఘోరాగా మారి అరియమంగళంలోని జయ్ అఘోరా ఆలయంతో నిత్య పూజలు చేస్తున్నాడు.
తల్లి మరణ వార్త వినగానే అంత్యక్రియలు నిర్వహిచేందుకు వచ్చాడు. వారణాసి నుండి తన స్నేహితులైన ఇతర అఘోరాలను రప్పిచి తల్లి అంత్యక్రియలు తమదైన శైలిలో నిర్వహించాడు.
అందులో భాగంగా మణికంఠన్ తన తల్లి శవంపై కూర్చుని అంత్యక్రియలు నిర్వహించాడు. అనంతరం మిగిలిన అఘోరాలతో కలిసి ఈ క్రతువును పూర్తి చేసి ఆమెను సమాధి చేశారు. అయితే క్షుద్రపూజల తరహాలో అఘోరాలు శవంపై కూర్చుని అంత్యక్రియలు నిర్వహంచడం చర్చనీయాంశంగా మారింది.. ఈ అంత్యక్రియల్లో దగ్గర బంధువులు మాత్రమే పాల్గొనగా మిగిలిన గ్రామస్తులంతా భయపడి ఇళ్లలోనే ఉండిపోయారు.