ఫిలిప్పీన్స్: తన వివాహ వేడుకను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని తలచిన ఆ నవ వధువుకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఇందుకు ఆమె వెడ్డింగ్ ప్లానరే కారణం కావడం గమనార్హం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్లోని పాసింగ్ నగరానికి చెందిన పిన్ టమాయో తన పెళ్లిని ఘనంగా జరుపుకోవాలని ఓ వెడ్డింగ్ ప్లానర్కు అప్పగించింది. వరుడు జాన్ చెన్తో కలిసి టమాయో వెడ్డింగ్ ప్లానర్కు 140,00పెసోస్(భారత కరెన్సీలో సుమారు రూ.2లక్షలు) కూడా చెల్లించారు.
అంతవారే చూసుకుంటారనే నమ్మకంతో ఉంది ఆ జంట. పెళ్లి రోజు రానే వచ్చింది. బంధుమిత్రుల మధ్య ఆ జంట ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత రిసెప్షన్లో అతిథులకు విందు భోజనం పెట్టాల్సి ఉండగా, ఆ వెడ్డింగ్ ప్లానర్ చేతులెత్తేశారు. దీంతో సమీపంలోని టమాయో తమ కుటుంబీకుల రెస్టారెంట్ నుంచి భోజనం ఆర్డర్ చేసి అతిథులకు అందించారు.
కన్నీరుమున్నీరైన నవ వధువు…
వెడ్డింగ్ ప్లానర్ నిర్వాకంతో నవ వధువు టమాయో ఆవేదనకు గురైంది. దీంతో ఆమెను ఓదార్చిన కుటుంబసభ్యులు.. వేదిక వద్ద ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయాల్సిందిగా కోరారు. కేక్ కట్ చేసిన టమాయోకు మరోసారి నిరాశే ఎదురైంది. కేక్ కట్ చేయగా.. అందులో థర్మకోల్ ఉండటం ఆమెను మరింత షాక్కు గురిచేసింది. పైన మాత్రమే క్రీమ్ పూసి.. లోపల మొత్తం థర్మకోల్ ఉండటంతో ఆమె ఆవేదన, ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మొదట ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్న టమాయో.. ఆ తర్వాత తన వివాహ ఉత్సవాన్ని ఇలా చేసిన వెడ్డింగ్ ప్లానర్ ను కఠినంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెడ్డింగ్ ప్లానర్ క్రిస్సా కనానియాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో చాలా మంది తమ వివాహ వేడుకలను వెడ్డింగ్ ప్లానర్లకు ఇవ్వడం సాధారణంగా మారిపోయింది. ఈ ఘటనను ద్రుష్టిలో పెట్టుకుని వెడ్డింగ్ ప్లానర్ ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందనే చెప్పాలి.