ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా? అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు అదే పంథా: చంద్రబాబు ఫైర్

chandrababu-naidu
- Advertisement -

అమరావతి: విమర్శను స్పోర్టివ్‌గా తీసుకోవాలని, సద్విమర్శను స్వాగతించాలని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

పాత్రికేయులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమని, ప్రశ్నించే గొంతును నొక్కాలని చూడటం హేయమన్నారు.

ఎక్కడ పత్రికలకు నిజమైన స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. తప్పుడు కేసులతో మీడియాను అణిచివేయాలని చూడటం మంచిది కాదన్నారు. పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడం ఇప్పటికైనా మానుకోవాలంటూ ఆయన హితవు పలికారు.

పాత్రికేయులకు అభినందనలు…

ఆదివారం ‘పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించి, పాలకుల వేధింపులను తట్టుకుని, నిష్పాక్షికంగా వార్తలను అందిస్తూ ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు చేస్తున్న కృషి నిరుపమానం..’ అన్నారు.

‘‘అప్పుడూ, ఇప్పుడూ పత్రికా స్వేచ్ఛకే…’’

పత్రికా స్వేచ్ఛకు కట్టుబడ్డ పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్న బాబు.. పత్రికా స్వేచ్ఛకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా టీడీపీ ముందుండి పోరాడిందని గుర్తు చేసుకున్నారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో 938కు వ్యతిరేకంగా, ప్రస్తుత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో జీవో 2438కు వ్యతిరేకంగా తాము పోరాటం చేశామని తెలిపారు.

సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో, అణగారిన వర్గాల హక్కుల సాధనలో మీడియాదే కీలక భూమిక అని చంద్రబాబు స్పష్టం చేశారు.

జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ.. ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్‌పై పోరాటంలో కూడావారు ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉంటూ ప్రాణాలను ఫణంగా పెట్టి సమాచార సేకరణ కోసం విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితిలో అటు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ.. ఇటు ప్రజారోగ్యం కోసం పాటుపడాలని చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు సూచించారు.

 

- Advertisement -