అమరావతి: ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదన్న ఉద్దేశంతోనే ఆ రోజున బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడామని చంద్రబాబు చెప్పారు. శుక్రవారం శ్రీశైలం జలాశయం వద్ద ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సున్నిపెంట వద్ద పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా బాబ్లీ ఎపిసోడ్, నాన్ బెయిలబుల్ వారెంట్ తదితర విషయాలపై స్పందించారు.
చదవండి: సంచలనం: చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్.. అదీ నాన్ బెయిలబుల్! ఎందుకంటే…
చదవండి: ఎనిమిదేళ్ల నాటి ఆందోళనకు ఇప్పుడు వారెంటా? ఇది మోడీ మార్కు కుట్రే: సోమిరెడ్డి ఫైర్
బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బాబు మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం తాము బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్తే.. నాటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోనే అరెస్టు చేశారని, ఎన్నోవిధాలుగా తమను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారని చెప్పారు.
ఎవరికీ అన్యాయం చేయలేదు…
తాను ఏ నేరం చేయలేదని, ఘోరాలు చేయలేదని, ఎవరికీ అన్యాయం చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేనేం తప్పు చేయలేదు.. ఏం చేస్తారో చేయండి అని ఆ రోజే పోలీసులకు చెప్పాను..’’ అని చంద్రబాబు తెలిపారు. కేసులు పెట్టామని ఒకసారి, పెట్టలేదని మరోసారి చెప్పి బలవంతంగా ఒక ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలిపెట్టారని నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా…
ఇప్పుడేమో నోటీసులు పంపామని, అరెస్టు వారెంటు ఇచ్చామని మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ‘’నేను అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తాను. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందో ప్రజలే ఆలోచించాలి..’’ అని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.