న్యూయార్క్: భయంకరమైన ఫ్లోరెన్స్ తుపాను దెబ్బకు అమెరికా వణికిపోతోంది. ప్రస్తుతం ఈ భీకర తుపాను కరోలినా తీరానికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను కారణంగా గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడమేకాక కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అధికారులు తీరప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాను కారణంగా వీచే పెనుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ కరోలినా, జార్జియా, వర్జీనియా, మియామి, ఫ్లొరిడా రాష్ట్రాల్లోని పలు ముఖ్య ప్రాంతాలపై ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు…
తీర ప్రాంతంలోని ప్రజలు నిత్యావసర వస్తువులు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీరు, ఆహారం, ఇతర తినుబండారాలు కొనేందుకు ప్రజలు మార్ట్ల ముందు బారులు తీరారు. చాలా దుకాణాల్లో ఇప్పటికే సరుకు నిల్వలు అయిపోయాయి. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి ఫ్లోరెన్స్ తుపాను తూర్పు తీరాన్ని తాకొచ్చని అంచనా.
ఈ ఫ్లోరెన్స్ తుఫాను గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. పెను విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, సామాన్య ప్రజలకు అండగా ఉండాలని ఆయన సూచించారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న అధికారులకు ‘భేష్’ అంటూ అధ్యక్షుడు ట్రంప్ కితాబిచ్చారు.