అమరావతి: సీఎం జగన్ సారథ్యంలోనే ఏపీ కేబినెట్ నేడు తొలిసారి భేటీ కానున్నారు. ఈరోజు జరగబోయే భేటీలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృద్ధాప్య పింఛన్లు రూ.2250కు పెంచడం, ఆశా వర్కర్ల వేతనాలు రూ.10,000కు పెంపు, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, రైతు బంధు పథకం, హోంగార్డుల వేతనాల పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై కేబినెట్ చర్చించనుంది.
ఇక మరో కీలక అంశం ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పై కేబినెట్ దృష్టి పెట్టనుంది. త్వరలోనే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకుంటుందని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు.
అలాగే ఆర్టీసీ కార్మికుల సమ్మెకూడా ఉండకపోవచ్చని చెప్పారు. అయితే ఆర్టీసీలో 53 నుంచి 54 వేలమంది ఉద్యోగులు, సిబ్బందికి వేతనాల రూపంలో నెలకు రూ.100 కోట్లు ఇవ్వాల్సి వస్తోందన్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వమే చెల్లించే ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు.