ఎట్టకేలకు తన తప్పు ఒప్పుకున్న శాంసంగ్‌.. కార్మికులకు క్షమాపణ, పరిహారం

- Advertisement -

samsung apologises to workers cancer caused its samsung factories

సియోల్‌ : దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ఎట్టకేలకు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది. తమ ఫ్యాక్టరీలో పనిచేయడం మూలంగా కొంతమంది ఉద్యోగులు క్యాన్సర్‌ బారిన పడుతున్నారని అంగీకరించిన సంస్థ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. తద్వారా దశాబ్ద కాలంగా సాగుతున్న వివాదానికి ముగింపు పలికింది.

ఫ్యాక్టరీ మూలంగా 16 రకాల క్యాన్సర్‌లు…

దక్షిణ సియోల్‌లోని సువాన్‌లో శాంసంగ్‌ నెలకొల్పిన సెమీకండక్టర్‌, ఎల్‌సీడీ ఫ్యాక్టరీ వివాదానికి దారితీసింది.  ఈ ఫ్యాక్టరీ వల్ల అనేకమంది అతిప్రమాదకరమైన క్యాన్సర్‌ బారిన పడుతున్నామంటూ ఉద్యోగులు 2007లో పోరాటానికి దిగారు. దాదాపు 320 మంది ఉద్యోగులు క్యాన్సర్‌ బారినపడగా,  వారిలో 118 మంది మృత్యువాతపడ్డారు.

ఈ ఫ్యాక్టరీ మూలంగా 16 రకాల క్యాన్సర్‌లు వ్యాప్తి చెందాయని, అలాగే కొన్ని ఇతర అరుదైన తీవ్ర వ్యాధులు, అనారోగ్యంతోపాటు, గర్భస్రావాలు, కార్మికుల పిల్లలు తీవ్రమైన కంటి రోగాల బారిన పడ్డారని ఉద్యమ కమిటీ వాదించింది.

ఈ నేపథ్యంలో.. తమ ఎల్‌సీడీ, సెమీ కండక్టర్‌ కర్మాగారాల్లో కార్మికుల భద్రత కోసం సరియైన రక్షణ చర్యలు తీసుకోలేకపోయామని శాంసంగ్‌ వెల్లడించింది. వ్యాధి బారిన పడిన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని శాంసంగ్‌ కో ప్రెసిడెంట్‌ కిమ్‌ కి నామ్‌ ప్రకటించారు. అలాగే ఒక్కో బాధితుడికి సుమారు 9 లక్షల రూపాయలు (133వేల డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించారు.

దీంతో గత పదేళ్లుగా పోరాటం సాగిస్తున్న ఉద్యమకారులు శాంతించారు.

పరిహారం సరిపోదు కానీ…

తాజాగా శాంసంగ్‌ క్షమాపణలు చెప్పడంపై ఉద్యమకారుల్లో ఒకరు, బాధిత మహిళల్లో ఒకరైన హ్వాంగ్ శాంగ్-జి సంతృప్తి వ‍్యక‍్తం చేశారు. తన 22 ఏళ్ల కుమారుడు 2007లో లుకేమియాతో కన్నుమూశాడని వెల్లడించారు. కంపెనీ క్షమాపణ కుటుంబాల బాధను ఏ మాత్రం తీర్చలేదని, నిజానికి సంస్థ ప్రకటించిన పరిహారం కుటుంబాలకు సరిపోదు కానీ, తాము అంగీకరిస్తున్నామన్నారు. ఎందుకంటే తమ బంధువుల మరణంతో.. తాము అనుభవించిన వేదన ఎన్నటికీ తీరనిదనీ, చాలా కుటుంబాలది ఇదే పరిస్థితని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -