
ఇస్లామాబాద్: కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజహర్ మృతి చెందినట్టు ఇప్పటికే విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఆయన చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని జైషే మహ్మద్ వర్గాలు ప్రకటించాయి.
ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స…
మసూద్ అజహర్ ఆరోగ్యంగా ఉన్నాడని ఓ ప్రకటనలో వెల్లడించాయి. మసూద్ అజహర్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కొన్నిరోజుల క్రితమే పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి చెప్పారు. తద్వారా జైషే అధినేత తమ దేశంలోనే ఉన్నాడని పరోక్షంగా అంగీకరించారు.
అయితే, మసూద్ అజహర్ లివర్ క్యాన్సర్ కారణంగా మృతి చెందాడంటూ కొన్ని కథనాలు తెరపైకి రాగా, భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్-2(ఎయిర్ స్ట్రయిక్)లో అతడు ప్రాణాలు కోల్పోయాడంటూ మరికొన్ని కథనాలు వచ్చాయి.
వీటన్నిటి నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు.. పాకిస్తానే మసూద్ అజహర్ చనిపోయాడంటూ ప్రచారం చేస్తోందన్న వాదనలు కూడా బయల్దేరాయి.
అయితే, భారత్ ఎయిర్ స్ట్రయిక్ నిర్వహించినప్పటి నుంచి ఇప్పటివరకు మసూద్ అజహర్ ఆచూకీ తెలియకపోవడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. దీనిపై మరిన్ని తెలియాల్సి ఉంది.
చదవండి: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నఅభినందన్ గన్స్లింగర్!








