అబుదాబి: యూఏఈకి చెందిన ఓ యువతి తన ప్రియుడ్ని చంపడమేకాక అతని మాంసంతో ఓ మొరాకో వంటకాన్ని తయారు చేసింది. అనంతరం అక్కడ పని చేస్తోన్న భవన నిర్మాణ కార్మికులకు ప్రియుడి మాంసంతో వండిన వంటకాన్ని వడ్డించింది. అబుదాబికి చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ యువతి తన ప్రియుడితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది.
కానీ సదరు వ్యక్తి ఆమెను కాదని మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడు. దాంతో తనను తిరస్కరించిన వ్యక్తి మీద పగ తీర్చుకోవాలని భావించిన యువతి అతడ్ని హత్య చేసింది. అంతటితో ఆగకుండా అతని శరీరంలో కొన్ని భాగాలను ముక్కలు చేసి వండింది. మిగిలిన మృత దేహాన్ని కుక్కలకు వేసినట్లు స్వయంగా సదరు యువతే కోర్టు విచారణలో తెలిపిందని యూఏఈకి చెందిన ‘ఖలీజ్ టైమ్స్’ పేర్కొంది.
మూడు నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తన సోదరుడు కనిపించడం లేదని మృతుడి తమ్ముడు.. సదరు యువతి ఇంటి వద్ద తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. తొలుత ఆ యువతిని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని బుకాయించింది.
అయితే ఆమె ఇంట్లో ఓ మనిషి దంతాలు కనిపించడంతో అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితురాలి ఇంట్లో దొరికిన దంతాలను డీఎన్ఏ పరీక్ష కోసం పంపగా అవి మృతుడివేనని తేలడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది.